Thursday, July 04, 2019

Wednesday, July 03, 2019

తెలంగాణ సాయుధపోరాటం... నీలారపు ఎర్రయ్య

సాయుధవీరుడు  - నీలారపు ఎర్రయ్య
( సెప్టెంబర్ 17 సందర్బంగా ప్రత్యేక వ్యాసం - తంగెళ్ళశ్రీదేవిరెడ్డి)

A

తెలంగాణ సాయుధపోరాటం... !
అస్తిత్వపు దేవులాటలో అసువులు బాసిన
వీరుల నెత్తుటి సంతకం...
మట్టి మనుషుల ఆత్మగౌరవం సాక్షిగా ఎగిసిన విజయ పతాకం...
నిరంకుశత్వం ఇకపై చెల్లదు అంటూ చరిత్రను తిరగరాసిన బందూకుల మోత...
ఇక్కడ చావుకు ఎదురునిలిచి...గడీల్లో వణుకు పుట్టించిన వీరుల కథలు ఏమయ్యాయి?
తామే ఆయుధమై తమ ఆయువును దేశానికి అర్పించిన త్యాగాల చరితలు ఎక్కడున్నాయి?
సాయుధపోరాటం ఇంకా అసంపూర్ణమేనా?
మరుగునపడిన గాథల వ్యథల కోసం కలాల్లో సిరాను నింపుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది?
విలీనమా.. విమోచనమా... విద్రోహమా.. అంటూ ఇంకా వేదికలు ఎక్కుతూ వాదనలు వినిపిస్తున్న కమ్యూనిస్టుల్లారా... చరిత్రకు ఎక్కని చరితార్థుల గురించి ఆలోచించరేం??

అగ్గిపిడుగు ఎర్రయ్య
°°°°°°°°°°°°°°°°°°°
నీలారపు ఎర్రయ్య.. !
1931-32 ప్రాంతంలో జన్మించాడు. దేవరుప్పుల వాస్తవ్యుడు. వీరి తండ్రి కొండయ్య, తల్లి సత్తెమ్మ.తాత సోమయ్య, నాయనమ్మ ఎలమంచమ్మ. చిన్నాయనలు నారాయణ, గట్టు మల్లయ్యలు. అందరితో ఇల్లు కళ కళ లాడుతూ ఉండేది. అంతేకాదు కుటుంబం మొత్తం సంగపోళ్ళకు వెన్నుదన్నుగా నిలిచింది.పెత్తందారీ వ్యవస్థను నిరసిస్తూ ప్రజారాజ్యం కోసం పరితపించింది.
👉నూనూగు మీసాల వయసు నుండే అలుపెరుగని పోరాట వీరుడుగా ఎర్ర జెండా చేతపట్టి పిడికిలెత్తి ముందుకు నడిచాడు ఎర్రయ్య! వాస్తవానికి ఆ సమయంలో పార్టీలు గురించిన ఆలోచన లేదు. ప్రజల గురించి పట్టించుకున్న వాళ్ళ పక్షాన నిలబడటమే ధ్యేయంగా ఎర్రయ్య వంటి యువకుల్ని చైతన్య వంతంగా ముందుకు నడిపించింది.
👉లోతైన ఆలోచనా శక్తి, తిరుగులేని వ్యూహరచన, ముందుకు నడిపించగల సామర్థ్యం ఎర్రయ్య సొంతం. అంతేనా... రజాకార్ల క్రౌర్యానికి తండ్రి బలై పోయినా ఉద్యమ బాట వదలని పోరుబిడ్డ ! ఆకలిదప్పులు మరిచి అడవుల్లో తిరుగుతూ బతుకును అజ్ఞాతానికి అంకితం ఇచ్చిన నిలువెత్తు సంకల్పం ! సర్కారుకు ఎదురునిలిచిన గుండె ధైర్యం !

ఐలమ్మ పంట భుజాలకెత్తుకుని
°°°°°°°°°°°°°°°°°°°
👉1944 ప్రాంతంలో చాకలి ఐలమ్మ పంటను తమ కౌలు కిందికి విసునూరు దొర అనుచరులు ఎత్తుకు పోవాలని పన్నాగం రచించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండే ఆ విషయం ఆంధ్రమహాసభకు సకాలానికి చేరింది. అందరూ కలిసికట్టుగా చేరి దొర అనుచరుల్ని గుత్పలతో కర్రలతో తరిమికొట్టడం జరిగింది. అప్పుడు ఎర్రయ్య వయసు 14 సంవత్సరాలు మాత్రమే. అయినప్పటికీ ఆంధ్రమహాసభలో చురుగ్గా ఉన్నాడు. ఐలమ్మ పంటను భుజాలకు ఎత్తుకుని, పడుతూ లేస్తూ, ఇంటికి చేర్చిన భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర్రావు వంటి వాళ్లలో తనూ ఒకడుగా ఉన్నాడు. ఈ సంఘటనలో ఎర్రయ్య... వీపు... భుజాలు బాగా కందిపోయాయి. ఇరుపక్షాల దాడిలో దెబ్బలు కూడా తగిలాయి. ఎర్రయ్యతో పాటుగా చాలామందికి ఇదే పరిస్థితి. అయినా ఓర్చుకున్నారు. ఇట్లా ఇక్కడ ప్రాణాలకు తెగించి కష్టపడింది పార్టీ కార్యకర్తలు. సంఘటన తర్వాత కూడా దేశ్ముఖ్ నుండి సమస్యలు ఎదుర్కొన్నది కూడా పార్టీ కార్యకర్తలే. కానీ... తన పంట దోపిడీ కాకుండా దొర మనుషుల్ని ఎదురించిన ధీశాలిగా చరిత్రలో #ఐలమ్మ పేరు ఒక్కటే నిలబడిపోయింది. కానీ ఇక్కడ ప్రాణాలకు తెగించి దొరకు ఎదురు నిల్చింది ఎవ్వరు? ఇదొక సమిష్టి పోరాటం. ఈ పోరాటంలో అడుగడుగున సవాళ్ళను ఎదుర్కుంటూ.. ప్రమాదమే జీవితంగా బతికిన ఎర్రయ్య వంటి యోధుల పేర్లు చరిత్రలో కనీసం చివరి వరసలో కూడా కనిపంచక పోవడం బాధాకరం.

కొరియర్ గా...
°°°°°°°°°°°°°°°
పార్టీ కార్యకలాపాల కోసం తన 14-15 ఏండ్ల వయసు నుండే చురుగ్గా పనిచేసిన ఎర్రయ్య, కొరియర్ గా కూడా సమర్థవంతమైన పాత్ర
పోషించాడు. ఈ క్రమంలో ఒకసారి రావి నారాయణరెడ్డి, సుబ్బారావు, తదితరులు కలిసి రాసి ఇచ్చిన రహస్య సందేశాన్ని కడవెండి నుండి గబ్బెట దొర మంగారెడ్డి వద్దకు తీసుకువెళ్ళాడు. వెంటే కడవెండికి చెందిన బూడిద రామస్వామిగౌడ్ కూడా ఉన్నాడు. ఇద్దరూ ఎండలో బడి కిలోమీటర్లు నడిచాడు. గబ్బెట చేరుకున్నాక ఆకలి దప్పులు ఎక్కువయ్యాయి. అప్పటికి రామస్వామి నిరసించాడు. ఎర్రయ్య మాత్రం కూడదీసుకున్నాడు. ముందు వచ్చిన పని ముగించుకునాలి అనేది ఎర్రయ్య ధ్యేయం. అందుకే మంగారెడ్డి ఇంటి కోసం బయలుదేరాడు. అప్పటికి మంగారెడ్డి అంటే ఎవ్వరో ఎర్రయ్యకు తెల్వదు. కాగా గ్రామ ప్రజలు ఇచ్చిన సమాచారం ప్రకారం అతడొక దొరగా తెల్సింది.
👉పెద్ద గడి, వచ్చిపోతున్న జనాలు, అంతా చూసి ఎర్రయ్యకు కొంత భయం వేసింది.ఒంటరిగా ఉన్నారు. పైగా నిరాయుధులు. అప్పటికి దళాల్లో అన్ని స్థాయిల వారికి ఆయుధ పంపిణి జరగలేదు. అందుకే.... తామెవరో తెలిస్తే దొర బతకనివ్వడని గుండె దడదడ లాడింది. వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. ' మేము దొరతనానికి వ్యతిరేకులం. కానీ ఈ జనాలు మాకు దొర ఇంటిని చూపెట్టిన్రు. మంగారెడ్డి అంటే మరెవ్వరో ఉండొచ్చు.... ' అంటూ మనసులోనే తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. తర్వాత మరో మంగారెడ్డి కోసం సాయంత్రం వరకు ఊరంతా వెదికారు. చివరకు ఆ ఊరి మొత్తానికి అతడొక్కడే మంగారెడ్డి అని తెలిసింది. చేసేదిలేక ధైర్యం చేసి మంగారెడ్డి ముందుకు వెళ్లి ఉత్తరం అందించాడు ఎర్రయ్య. మంగారెడ్డి ఉత్తరం చూసుకున్నాడు. అట్లాగే నిలబడి ఉన్న ఎర్రయ్యకు కూర్చోమని మంచం చూపించాడు. అంబలి నీళ్లు ఇప్పించాడు. అన్నం పెట్టించాడు. వెంట వచ్చిన రామస్వామి అప్పటికే భయంతో పారిపోయి ఉన్నాడు. ఎర్రయ్య లోలోపల భయపడుతున్నాడు. మర్యాద చూపిస్తూ మెల్లగా చంపేస్తారేమోనని వణికిపోతున్నాడు కూడా. అట్లాంటిది ఏమీ జరగలేదు. పైగా కడవెండి వరకు నడుస్తూ వెళ్లడం కష్టమని కచ్చరం సిద్ధం చేయించాడు. ఎర్రయ్య ఒకింత గందరగోళానికి గురయ్యాడు. అయినా తప్పలేదు. కచ్చరం ఎక్కి కూచున్నాడు. కడవెండి దాక ప్రయాణం చేసాడు. కడవెండి వెళ్ళాక
' దొరలు ఎక్కే కచ్చరంలో తనను ఎవ్వరైనా చేస్తారేమోనని ' ఇబ్బంది పడ్డాడు. మొత్తానికి అతడి గబ్బెట ప్రయాణం అతడి జీవితంలో ఒక తీపి గుర్తుగా మారిపోయింది. అంతేకాదు...
'' దొర అంటే దోపిడీ మాత్రమే చేసేవాడు అనుకున్న నేను, దొర అంటే దేవుడు కూడా అని తొలిసారిగా మంగారెడ్డిని జూసి తెలుసుకున్న '' అని ప్రస్తుతం తన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నాడు.
👉కొరియర్ గా ఎర్రయ్య జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. అనుభవాలతో పాటుగా కష్టం ఉన్నది. ప్రమాదాలు కూడా ఉన్నాయి. కొరియర్ గా బయలు దేరినప్పుడు శత్రువులు
ఎదురైనప్పుడు వాళ్ళ దృష్టినుండి తప్పుంచుకోడానికి నానా పాట్లు పడాల్సి వచ్చేది. అన్నింటిని అధిగమించి భాద్యతను నెరవేర్చడంలో ఎర్రయ్య దిట్ట. అందుకే అగ్రనాయకులు ఎర్రయ్యను తమకు సరైనోడుగా గుర్తించి, ముందుకు నడిపించారు.

దేవరుప్పుల దళకార్యదర్శిగా...
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
👉దేవరుప్పుల దళ కమాండర్ గంగసాని తిరుమల్ రెడ్డికి ఎర్రయ్య మిక్కిలి ఆప్తుడు. తిరుమల్ రెడ్డి కంటే ముందుగా దళంలోకి వచ్చాడు. మొదట్లో చకిలం యాదగిరిరావు దళంలో కార్యదర్శి హోదాలో పనిచేశాడు. ఆయుధ శిక్షణలో ఆరితేరాడు.ఎత్తుకు పై ఎత్తు వేయడంలో, పన్నాగాల రూపకల్పనలో, పరిస్థితుల్ని అంచనా వేయడంలో, అపర చాణుక్యుడు . కాబట్టి దళ నాయకులకు కుడి భుజంగా ఎదిగాడు.
👉సాయుధపోరాటంలో మరణించిన ఎందరో వీరులకు స్థూపాలు కట్టించిన ఘనత ఎర్రయ్యకు దక్కుతుంది. ఇందుకు ప్రయాసకు ఓర్చి చందాలు వసులు చేసాడు. అంతేకాదు, ఎక్కడ ఎవ్వరికి కష్టం వచ్చినా తన వంతుగా అండదండల్ని అందించిన నిజమైన ఆత్మీయుడు.

ఊరు కోసం తండ్రిని కోల్పోయాడు
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
👉1947 వ సంవత్సరం. తెలంగాణ అట్టుడుకు తున్నది. రజాకార్లు గ్రామాల మీద పడి అల్లకల్లోలాలు సృష్టిస్తున్నారు. నిజాం పోలీసులు సాగిస్తున్న జులుం అడ్డు అదుపు లేకుండా పోయింది. మరోవైపు దొరల ఆగడాలు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎర్రయ్య చిన్నాయన నారాయణను పొలీసులు పట్టుకుని జైలుకు పంపించారు. ఇంకో చిన్నాయన గట్టు మల్లయ్య పోలీసులకు
దొరకవద్దనే ఉద్దేశ్యంతో పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? ఏమయ్యాడు? ఇవేమీ సాయుధపోరాటం విరమణ తర్వాత కూడా తెల్వలేదు. పోలీసులు లేదా రజాకార్ల చేతుల్లో హతుడై పోయాడో కూడా తెల్వదు. అప్పట్లో సంగపోళ్లకు మద్దతుగా నిలిచిన ప్రజలు, దళాల్లో పనిచేసిన కార్యకర్తలు, చాలామంది ఆచూకీ తెల్వకుండా పోయారు. వాళ్ళల్లో ఒకరిగా ఇప్పటికీ మల్లయ్య ఆచూకీ ప్రశ్న గానే మిగిలిపోయింది.
👉 ఉన్నటుండి ఒకరోజు...
ఎర్రయ్య తండ్రి కొండయ్యను పట్టుకోడానికి రజాకార్లు వ్యూహం పన్నారు. కామారెడ్డిగూడెంకు చెందిన, కొండయ్య కుటుంబానికి అదివరకే పరిచయం ఉన్న ఫకీర్ అహ్మద్ అనే ముస్లిం
యువకుడిని పావుగా వాడుకున్నారు. మాయమాటలతో ఫకీర్ అహ్మద్ సహాయంతో కొండయ్యను రప్పించి పట్టుకున్నారు. కొండయ్య దొరకగానే రెక్కలు విడిచి కట్టేశారు. కొండయ్య వెంటే కొండంత ఆందోళనతో దుఃఖంతో భార్య
సత్తెమ్మ, తల్లి ఎలమంచమ్మ ఉన్నారు. కొండయ్యను సజీవదహనం చేయాలి అన్నది రజాకార్ల పథకం.
👉ఆ సమయంలో ఎర్రయ్య, రాజారాం అనే దళ సభ్యుడితో కలిసి ఊరి బయట చెరువు కట్టకు దిగువగా ఉన్నాడు. కొందరు గ్రామస్తులు కూడా అక్కడే ఉన్నారు. కొండయ్యను రజాకార్లు పట్టుకెళ్తుంటే ఎర్రయ్య గమనించాడు. అంతే ! ఏదో ప్రమాదం జరగబోతున్నది అని అనుమానం వచ్చింది. ఆ సమయంలో చేతిలో బర్మా తుపాకీ ఉన్నది. గురి తప్పకుండా కాల్చడానికి రజాకార్లు కూడా సమీపంగా ఉన్నారు. అంతేకాదు కాల్చి తప్పించుకోడానికి చెరువు కట్ట అడ్డంగా ఉన్నది. రజాకార్లకు మాత్రం తప్పించుకునే అవకాశం లేదు. పైగా వాళ్ళ సంఖ్య కూడా తక్కువగానే ఉన్నది. ఎర్రయ్య ఇంక ఆలస్యం చేయలేదు. అవకాశం ఉన్నది కాబట్టి తుపాకీ ఎక్కుపెట్టాడు.
కానీ గ్రామస్థులు వారించారు. వాళ్లకు కూడా ప్రమాదం అర్థం అయ్యింది. అయినప్పటికీ ఒక్క కొండయ్య కోసం చూసుకుంటే ఆ రాక్షసులు గ్రామాన్నే తగులబెట్టేయడం ఖాయం అని అంచనా వేశారు. అందుకే ఎర్రయ్యను గుండె దిటువు చేసుకోమన్నారు. ఎర్రయ్య మారు మాట్లాడలేదు. తుపాకీ కిందకు దించాడు.
👉ఆ తర్వాత గ్రామంలో మారణహోమం జరిగింది. మర్రి పాపిరెడ్డికి చెందిన గడ్డి వామును తగలబెట్టి, ఆ మంటల్లో కొండయ్యను కాళ్ళుచేతులు కట్టి సజీవంగా విసిరేశారు. మంటలు క్షణ క్షణానికి పెరిగాయి. పెరుగుతూ అక్కడే ఉన్న పశువుల కొట్టాన్ని కూడా వ్యాపించసాగాయి. ఎద్దులు వేడిని తట్టుకోలేక గింజుకోసాగాయి.
👉కొండయ్య ఆర్తనాదాలు చేస్తుంటే రజాకార్లు సంతోషంగా చిందులేశారు. సత్తెమ్మ, ఎలమంచమ్మ శోకానికి అంతులేదు. కాగా అంతటి విషాద సమయంలో కూడా ఎలమంచమ్మ అక్కడ ఎద్దుల్ని గమనించింది. ఒకవైపు కొడుకు మరణాన్ని దిగమింగుకుంటూ.... మరోవైపు ఎద్దుల్ని తప్పించింది.

అర్థించినా అర్థంచేసుకోలేదు
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
త్యాగానికి మారుపేరుగా నిలిచిన ఎర్రయ్య కుటుంబం చరిత్రలో ఎందుకు విస్మరించబడింది? నాయకులు అందరూ సాయుధ పోరాటాన్ని కేవలం తమ అనుభవాల నేపథ్యంలో రాసుకోవడంతో ఎర్రయ్య వంటి వీరులు మరుగున పడిపోయారు అనేది వాస్తవం. ఈ నిజాన్ని ఎర్రయ్య గుర్తించాడు. తన చరిత్రను కూడా రాసుకోవాలి అనుకున్నాడు. అయితే తన చరిత్ర తన అనుభాలతో కూడి, తన సహచర వీరుల కథలతో అవకాశం ఉన్నంత వరకు
సంపూర్ణం కావాలని ఆరాటపడ్డాడు. కానీ చరిత్ర రాయాలి అంటే భాషా నైపుణ్యంతో పాటుగా రాసే విధానం తెలిసి ఉండాలి. ఎర్రయ్య చదువుకున్న వాడే. కానీ రాసే విధానం, పదాల పొందిక, సరిగ్గా తెల్వదు. ఈ పరిస్థితిలో గుండెల నిండా మాత్రం అనుభవాలు నిండి, గుండె బరువెక్కి ఉన్నది. ఆ బరువు దించుకోవాలి. చరిత్రలో లిఖించబడని ఎన్నో నిజాలను బయటకు తీసుకురావాలి. ఇదే సంకల్పంతో ఎర్రయ్య ఆలస్యం చేయకుండా పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరావులను ఒకరి తర్వాత ఒకరిని కలిసాడు. తన అనుభవాలను చరిత్రగా రాయమని అడిగాడు. అభ్యర్థించాడు కూడా. కానీ ఎవ్వరూ కూడా ఎర్రయ్య ప్రయత్నానికి సానుకూలంగా స్పందించలేదు.
👉ఇట్లా ఒక్క ఎర్రయ్య చరిత్ర మాత్రమే కాదు, ఎందరో వీరుల చరిత్రలు మరుగున పడిపోయాయి. ఇంకా బతికే ఉన్న 90 ఏండ్ల ఎర్రయ్య మంచి తెలివితేటలతో ఉన్నాడు. చరిత్ర వక్రీకరణ జరిగింది అంటూ అసహనం బాధ వ్యక్తం చేస్తున్నాడు. రాసే ఉత్సాహం ఉంటే తన చరిత్ర చెప్పడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఎర్రయ్య సంకల్పం నెరవేరాలని ఆశిద్దాం !!