Monday, July 16, 2007

తెలంగాణ మనగా తెలుగువారుండు దేశమని అర్థము.

తెలంగాణ మనగా తెలుగువారుండు దేశమని అర్థము.

ఇది ప్రాచీనపదము. ఒకప్పుడు తెలంగాణము దక్షిణాపథమున విశాల భూభాగమును ఆక్రమించి యుండెను. కాని కాలక్రమమున తెలంగాణము చీలికలయి, వేర్వేరు రాజుల ఆధిపత్యములోకి వచ్చినందున వేర్వేరు నామమలను బొందెను, అయినను హైదరాబాదు రాష్ట్రములోని హైదరాబాదు, వరంగల్లు, ఖమ్మముమెట్టు, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ అను తొమ్మిది జిల్లాలకు ప్రాచీన తెలంగాణ శబ్దమే నిలిచిపోయినది. తెలంగాణ పదము ఈ తొమ్మిది జిల్లాలకు అన్వయిచుచు, రాజకీయ పత్రములందు వ్యవహరించుచున్నారు.

ఈ తొమ్మిది జిల్లాల యందును తెలుగువారు ప్రధానముగా నుంటచే తెలంగాణ శబ్దము సార్థకముగా నున్నది. అసలీ తెలంగాణమే తెలుగువారికి ఆది నివాస భూమిగా నుండెను. ఇచ్చిటి నుండియే వారు పలు ప్రాంతములకు విస్తరిల్లిరి.

ఆ ప్రాంతములందు ఆంధ్ర శబ్దము ప్రచారమునకు వచ్చి, ఆంధ్రప్రాంతంగా రూఢియై పోయినది. తెలుగువారు ఆంధ్రులు గనుకను, ఆంధ్రులు తెలుగువారు గనుకను ఇప్పుడంతయు తెలంగాణమే, అంతయు ఆంధ్రాణమే.

మట్టి పొరలలో శ్వాసిస్తున్న విత్తనం భూమిని చీల్చుకొని వచ్చి తన అస్థిత్వాన్ని ప్రకటింపచేస్తుంది. భావగర్భితమైన తన లక్షణాలను బట్టి విత్తనం స్వభావం తెలుస్తున్నది. గట్లనే తెలంగాణ నేడు జర్గుతున్న తెలంగాణ ఆస్థిత్వ పోరాటంలో ‘సాంస్కృతిక పునరుజ్జీవం’ అంగర్భాగం కావాలి.