Wednesday, September 08, 2010

నా తెలంగాణ కోటి వజ్రాయుధాల ఖనిజం. కోటి సత్యాల ఖజానా. తుదిలేని అక్షర సామ్రాజ్యం. అది విమోచనల మహామేరువు : Excerpt from Andhra Jyothi News Paper



తెలంగాణ ఒరలో 'వజ్రాయుధం'

ప్రముఖ సాహితీవేత్త, కవి, విమర్శకుడు ఆవంత్స సోమసుందర్‌ను పిఠాపురంలోని అతని నివాసంలో నేను కలవడం జరిగింది. 85 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో బాధపడుతూ కూడ ఆయన ఉత్సాహాన్ని కూడగట్టుకుని మాట్లాడారు. సోమసుందర్‌ను కలిసేందుకు వెళ్లడానికి ప్రధాన కారణం ఆనాటి వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన సాహిత్యం ద్వారా పాలుపంచుకున్నాడు.

తన ఒంటికి తెలంగాణ మట్టిని రాసుకుని వజ్రాయుధం అన్న కవిత్వాన్ని తెలుగు ప్రజలకు అందించాడు. సోమసుందర్ ఆనవాళ్లు ఎక్కడున్నాయంటే వజ్రాయుధంలో వున్నాయని ఎవరైనా ఇట్టే చెబుతారు. ఈనాడు తెలంగాణ గడ్డమీద ఎగుస్తున్న వేరు తెలంగాణ ఉద్యమంపై ఆయన అభిప్రాయాలను తెలుసుకునేందుకే ఆయన దగ్గరకు వెళ్లాను. తెలంగాణ మట్టి నిన్ను వజ్రాయుధం కవిని చేసింది.

ఈనాడు ఆ మట్టిమీద ఎగుస్తున్న ప్రజల ఆకాంక్షలకు నువ్వు అక్షర రూపం అవుతావా అని ప్రశ్నించేందుకై పిఠాపురం వెళ్లాను.ఆయన ఏమీ తడుముకోకుండా తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. తన ఆరోగ్యం కుదుటపడితే తెలంగాణ గడ్డ మీద ఎగుస్తున్న సాహిత్య జెండాకు తన చేతులను కూడా అందిస్తానన్నాడు.

తెలంగాణ మట్టిమీద ప్రేముందని చెబుతూ ఈ తెలంగాణ ఉద్యమం గురించి ఒక వాక్యమైనా రాయని వాళ్లకంటే సోమసుందర్ ఎంతో నయమనిపించింది.తెలంగాణది ఆత్మగౌరవ పోరాటమని మీడియా ముందు తన ఇంట్లోనే సోమసుందర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడిన మాటలు చిన్న ఇంటర్వ్యూగా మారాయి.

? ఆనాడు వజ్రాయుధ కావ్యం రాసిన సోమసుందర్, ఈనాటి వేరు తెలంగాణ పోరాటాన్ని ఏమంటారు?
ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం ఉన్నత మైనది. ప్రస్తుతం తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతా లలో కొందరు రాజకీయ, ఆర్థిక ఆధిపత్యం కోసం పెను గులాడుతున్నారు. ఈ సందర్భం చూసినప్పుడే నాకు కాస్తంత భయమేస్తుంది. సున్నితమైన అంశాలపై రెండు ప్రాంతాల ముఖ్యులు ఆలోచించాలి. ప్రజాస్వామిక ఆకాంక్షలను గౌరవించాలి.

? ఇప్పుడు నడుస్తున్న ఉద్యమంపై మీ అభిప్రాయం?
మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఉద్యమ రూపం వచ్చింది. ఇంకా పూర్తి స్వభావం రాలేదు. విగర్ ఆఫ్ ది మూవ్‌మెంట్ ఎగ్జిగ్యూట్ కావటం లేదు. అందుకోసం వెయిట్ చేయవచ్చును.

? ఆనాడు వజ్రాయుధాన్ని ఏ స్ఫూర్తితో రాశారు?
1945 జనవరి దాకా రాశాను. 1945 మార్చి 8వ తేదీన వజ్రాయుధం విడుదలైంది. ఆధునిక పొలిటికల్ వొకాబిలిటీకి మొదటి పుస్తకం ఇది. వజ్రాయుధం రాగానే చిత్రం జరిగింది. మోస్ట్ పాజిటివ్ పీపుల్స్ వజ్రాయుధానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఒక వర్గం దాన్ని చూసి అదిరిపోయింది. కొందరు వ్యతిరేకించారు. సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి లాంటి వాళ్లు సమర్థించారు. విద్వాన్ విశ్వం లాంటివాళ్లు అటు ఇటుగా మాట్లాడారు. ఈ శతాబ్దానికి జ్ఞానమిచ్చిన పుస్తకంగా సుంకర అభివర్ణించారు. ఆంధ్ర భూస్వామ్య పెత్తందార్లతో పెనుగులాట మొదలైంది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని రూపంగా తీసుకుని వజ్రాయుధం రాశాను.

? ఆ పుస్తకం రాశాక ఆదరణ గురించి ఆలోచించారా?
నేరుగా సాయుధ పోరాటంలోకి దూకాలనిపించింది. చండ్ర రాజేశ్వరరావును కలిశాను. ఆయన స్పందించారు. నా ఆవేశం చూసి తుపాకులేమైనా తీసుకు వచ్చావా? అని ఆయనడిగారు. చైనా వాళ్లనడిగి తీసుకువస్తానన్నాను. సాయుధ పోరాటంలో పాల్గొనాలని నీ దగ్గరకొచ్చా నన్నాను. తుపాకులు పేల్చేవారు తెలంగాణలో చాలా మంది వున్నారు. నువ్వు కవిత్వం రాసుకోపో! అని ఆయన అన్నాడు.

? వేరు తెలంగాణ పోరాటాన్ని మీరెలా అర్థం చేసు కుంటున్నారు?
1. సాహిత్య, సాంస్కృతిక ఉద్యమం
2. రాజకీయ ఉద్యమం
రెండు రకాలుగా ఈ ఉద్యమాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ రాజకీయ ఉద్యమంలో సందేహపావులుంటారు. రాజకీయంలో ఎవరి భావాలు వారికుంటాయి. రాజకీయాలలో పరిణితి లేకుండా ఆలోచించటం కూడా వుంటుంది. కాని సాహిత్య సాంస్కృతిక ఉద్యమానికి స్పష్టత ఉంటుంది. నిజాయితీ వుంటుంది. తెలంగాణ నేల నుంచి పెల్లుబుకుతున్న సాహిత్య, సాంస్కృతిక ఖజానాను చూసి ఆనందిస్తున్నాను. సాహిత్య రంగంలో కూడా రాజకీయరంగం మాదిరిగా తప్పించుకునేవాళ్లు వుంటారు. అయితే వారి సంఖ్య తక్కువ. తెలంగాణ సాహిత్యకారులలో ఏకాభిప్రాయం వుంది. దానిని అందరూ ఆహ్వానించవలసిందే. కాని రాజకీయ పార్టీలలో ఏకాభిప్రాయాలు తక్కువగా వుంటాయి. భిన్నాభిప్రాయాలు ఎక్కువగా వుంటాయి.

? అంపశయ్యపై భీష్ముడిగా వున్న మీరు ఎవరిది ధర్మయుద్ధమంటారు?
ధర్మం గెలుస్తుంది. ఆ ధర్మం తెలంగాణకు అనుకూలంగా వుంది. తెలంగాణ యుగ యుగాల దోపిడీ, రాపిడీలో ప్రాణంలేని నత్తలాగ బతికింది. అది విజృంభిస్తుంది. అది ఉద్యమానికే కొత్త జీవికనిస్తుంది. కొత్త జీవితాన్నిస్తుంది. తెలుగు అక్షరానికే ఆ ఉద్యమం నవజీవనమౌతుంది.

? ఈ ఉద్యమంలో మీ పాత్ర?
నా ఆరోగ్యం అంపశయ్యపై వుంది. అది ఏ మాత్రం కుదుటపడ్డా తెలంగాణ ఉద్యమానికి, సత్యాన్ని చాటడానికి నా రెండు చేతులెత్తి ఉద్యమానికి నమస్కరించి మద్దతు తెలియజేస్తాను. నిర్ద్వంద్వంగా తెలంగాణ తన ప్రాణం కోసం, తన వునికి కోసం, తన అస్తిత్వం కోసం, ఆత్మ గౌరవ నినాదంతో దూసుకుపోతుంది. ఆ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి కుప్పలు తెప్పలుగా ఒక నదిలాగా సాహిత్య, కళారంగాలు ప్రవహిస్తున్నాయి.

ఈ సందర్భంగా ఆయన తన చేతి రాతతో కాగితంపై ఏవో కొన్ని గీతలు గీసి యిచ్చాడు. అవేమిటంటే 'ఆత్మగౌరవం కోసం మనిషి ఎన్ని పోరాటాలు జరిపినా మానవీయ మహా సమరం తుదిశ్వాస విడువదు. తుది విజయం సాధించేంతవరకు ఈ సమరం సమాప్తం కాదు. నా తెలంగాణ కోటి వజ్రాయుధాల ఖనిజం. కోటి సత్యాల ఖజానా. తుదిలేని అక్షర సామ్రాజ్యం. అది విమోచనల మహామేరువు.'

ఇంటర్వ్యూ: జూలూరు గౌరీశంకర్